Congress | రిషికేశ్, మార్చి 9: లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరోవైపు మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ నేత సురేశ్ పచౌరీ, కొందరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. హిమాచల్ ప్రదేశ్లో ఆరు మంది రెబల్స్తో సహా 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినట్టు సమాచారం. శనివారం వీరంతా హర్యానా నెంబర్ ప్లేట్ ఉన్న బస్సులో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్కు చేరుకున్నారు. వారంతా రిషికేశ్లోని తాజ్ హోటల్లో దిగారు. అధికార కాంగ్రెస్లో అంతర్గత పోరు సమసిపోలేదని వారంతా సంకేతాలిచ్చారు. రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సుఖు ఢిల్లీకి వెళ్ళిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకున్నది.
లోక్సభ ఎన్నికలపై చర్చించడంతోపాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై నివేదిక సమర్పించేందుకు సీఎం సుఖ్విందర్ ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. తిరుగుబాటు చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకుంటారా? అన్న ప్రశ్నకు చేసిన తప్పును గుర్తించిన వారు మరో అవకాశం పొందగలరని నర్మగర్భంగా సీఎం సమాధానమిచ్చారు. అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ ఇప్పుడు బంతి జాతీయ నాయకత్వం కోర్టులో ఉన్నదని చెప్పారు. గత నెల రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేసిన విషయం విదితమే. దీంతో ఆరుగురు పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. స్పీకర్ చర్యను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పార్టీలో సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో రాష్ట్ర సీఎం సుఖ్విందర్ విఫలమైనట్టు పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు ఇదివరకే నివేదికలు అందాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు హిమాచల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో పతనం కానున్నదని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ జోస్యం చెప్పారు. శనివారం హరిద్వార్లో మాట్లాడుతూ సుఖు ప్రభుత్వం అంతర్గత విభేదాలతో అల్లాడిపోతోందని, దీని వల్ల ఆ ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందని కూడా ఆయన అన్నారు.
అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గొర్రెలను కాపాడినట్టు బీజేపీ కాపు కాస్తున్నదని హిమాచల్ సీఎం సుఖు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ఒక చోట ఉంచకుండా తిప్పుతున్నారని మండిపడ్డారు. మండిలో ఓ సభలో మాట్లాడుతూ తిరుగుబాటు ఎమ్మెల్యేలను మొదట హర్యానాలోని పంచకులలో ఓ హోటల్లో ఉంచారని, ఆ తర్వాత చార్టర్డ్ విమానంలో డెహ్రాడూన్కు తరలించారని, ఇప్పుడు రిషికేశ్లోని ఓ హోటల్ లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
భోపాల్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సురేశ్ పచౌరీ, మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ రజుఖేడీ, కొందరు మాజీ ఎమ్మెల్యేలు సహా మొత్తం 11 మంది నేతలు శనివారం బీజేపీలో చేరారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు వీడీ శర్మ సమక్షంలో వీరంతా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో సురేశ్ కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా, నాలుగుసార్లు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. దాదాపు ఇరవై ఏండ్ల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను కూడా నిర్వహించారు. బీజేపీలో చేరిన తర్వాత సురేశ్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ కుల రహిత, వర్గ రహిత పార్టీ అని చెప్పుకుంటుందని, అందుకు విరుద్ధంగా ఆ పార్టీ కులాల ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తున్నదని మండిపడ్డారు.