కోల్కతా : పెండ్లి రోజు, బర్త్డే ఇలా సందర్భం ఏదైనా హిల్సా చేపతో జల్సా చేసుకోవడం బెంగాలీలకు (Bengal Fish) ఆనవాయితీ. హిల్సా లేకుండా బెంగాలీలకు ముద్ద దిగదంటే అతిశయోక్తి కాదు. ఇక బెంగాల్ పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమై, బాంబుల మోత మోగగా హిల్సా రూపంలోనూ బెంగాలీలకు చేదు అనుభవమే ఎదురవుతోంది. ఓవైపు హిల్సా సరఫరాలు తగ్గి కొరత ఏర్పడగా, ఎన్నికల వేళ డిమాండ్ పెరిగి ఈ చేప ధర చేదెక్కింది.
అసలే ఖరీదైన హిల్సా ఆపై కొండెక్కి కూర్చోవడంతో సగటు హిల్సా ప్రియులకు జల్సా కరువైంది. గత వారం రోజులుగా హిల్సా ధర చుక్కలు చూస్తోంది. కోల్కతాలోని మణిక్తల, బలిగంజ్ మార్కెట్లలో హిల్సా కిలో ధర రూ. 650 నుంచి రూ. 800 వరకూ పలుకుతోంది. భారీ సైజ్ ఉన్న చేపల ధర కిలోకు మరికొంత అధికంగా పలకడంతో సగటు వినియోగదారులు హిల్సా జోలికి వెళ్లే సాహసం చేయడం లేదు.
బెంగాల్ ఫిషింగ్ హార్బర్ల నుంచి హిల్సాలు తక్కువగా సరఫరా అవుతున్నాయని, ఎన్నికల వల్ల కూడా సరఫరాలు దెబ్బతిన్నాయని చేపల వర్తకులు చెబుతున్నారు. నావికులు, మత్స్యకారులు ఓట్లు వేసేందుకు ఇండ్లకు తిరిగిరావడంతో ఈ పరిస్ధితి నెలకొందని అంటున్నారు. ఫిషింగ్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో పశ్చిమ బెంగాల్ అంతటా హిల్సా కొరత ఏర్పడిందని అంటున్నారు. దీంతో కోల్కతా సహా రాష్ట్ర వ్యాప్తంగా హిల్సా ధరలు భగ్గుమంటన్నాయి. కొరత నిలిచిపోయి సరఫరాలు మెరుగుపడగానే చేప ధరలు దిగివస్తాయని ట్రేడర్లు చెబుతున్నారు.
Read More :