బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతున్నది. ఈ క్రమంలో హుబ్లీ – ధార్వాడ్లో పోలీసులు ఈ నెల 28 వరకు విద్యాసంస్థలకు 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144ను అమలులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు సీపీ లాభూరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు జంటనగరాల పరిధిలో పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు 200 మీటర్ల దూరంలో గుమిగూడడం, ఆందోళన, నిరసన కార్యక్రమాలపై నిషేధం ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో హిజాబ్ – కాషాయ కండువాల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. అన్ని పాఠశాలల్లో తరగతులు సక్రమంగానే సాగుతున్నాయని, కేవలం రెండు మూడు పాఠశాలల్లో ఘటనలు నమోదయ్యాయని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ పేర్కొన్నారు.