Ayodhya | అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమం కోసం యావత్ భారత దేశం ఎదురుచూస్తుండగా.. వేడుకకు వేర్పాట్లు చకాచక సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో అయోధ్య నగరంలో ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది. అయోధ్యలో కార్యక్రమం దేశానికి చాలా కీలకమైన రోజని.. ఇందుకోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పెషల్ డీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు.
సీసీటీవీల ద్వారా నిఘాను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగే 22న, ఆ తర్వాత నుంచి రాముడి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అసౌకర్యం కలగుకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అయోధ్యలో 10వేలకుపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నగర భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. భద్రతను పర్యవేక్షించేందుకు ఎంతో ఉపయోగపడతాయని స్పెషల్ డీజీ చెప్పారు.