న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన సమన్లను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తాను న్యాయపరమైన చర్యలు చేపడతానని సోరెన్ గత నెలలో దర్యాప్తు సంస్ధతో తలపడ్డారు. ఇక హేమంత్ సోరెన్ పిటిషన్ను సర్వోన్వత న్యాయస్ధానం సోమవారం విచారించనుంది. కాగా మనీల్యాండరింగ్ కేసు విచారణలో పాల్గొనాలని ఈడీ గత నెల సోరెన్ను కోరింది.
తాను ఈడీకి అన్ని పత్రాలను అవసరమైన సమాచారాన్ని అందించానని, దర్యాప్తు ఏజెన్సీ ఎలాంటి సమాచారం అవసరమైనా ఆ పత్రాలను పరిశీలించవచ్చని సీఎం ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. జార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లాలో అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి మనీల్యాండరింగ్ వ్యవహారంలో హేమంత్ సోరేన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ ఆరోపణలను తోసిపుచ్చిన సోరెన్ గిరిజన నేతను వేధించేందుకు భారీ కుట్రలో భాగంగానే తనపై అభియోగాలు మోపుతున్నారని దుయ్యబట్టారు. 2020లో తన తండ్రి శిబూ సోరెన్పై లోక్పాల్ ఆదేశాలకు అనుగుణంగా చేపట్టిన విచారణలో తన స్ధిర చరాస్తుల వివరాలను సీబీఐకి అందచేశానని గుర్తుచేసిన సోరెన్ సీబీఐ నుంచి ఈడీ ఆయా వివరాలను పొందవచ్చని అన్నారు. ఇక గత ఏడాది నవంబర్లో కూడా ఈడీ సమన్లను సోరెన్ పట్టించుకోకుండా ఓ డ్యాన్స్ వేడుకలో పాల్గొనేందుకు చత్తీస్ఘఢ్ వెళ్లడం దుమారం రేపింది.
Read More :