న్యూఢిల్లీ: క్యాన్సర్ రోగుల కోసం కొంత మంది అంకాలజిస్టులతో కూడిన బృందం ‘సెకండ్ ఒపీనియన్’ హైల్ప్లైన్ నంబర్ను ప్రారంభించింది. తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకొనే రోగులు.. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ‘9355520202’ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ నంబర్కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు డైరెక్ట్గా నిపుణులైన అంకాలజిస్టుతో ఉచితంగా మాట్లాడొచ్చు. చికిత్సపై చర్చించేందుకు వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం ఉన్నది.
‘క్యాన్సర్ ముక్త్ భారత్ క్యాంపెయిన్’లో భాగంగా ఈ కార్యక్రమం చేపటినట్టు క్యాంపెయిన్ హెడ్ డాక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ బారినపడిన రోగులందరికీ సెకండ్ ఒపీనియన్ను సిఫారసు చేస్తున్నామన్నారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి వివిధ దవాఖానల్లో వేర్వేరుగా ఖర్చు అవుతుందని, ఇది కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి మరో కారణమని ఆశిష్ గుప్తా అన్నారు. క్యాన్సర్కు సంబంధించి భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి తమ హైల్ప్లైన్ ఒక విలువైన వనరుగా ఉపయోగపడుతుందని, కచ్చితమైన సమాచారం అందిస్తుందని పేర్కొన్నారు.
దేశంలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు, ఇందుకు సరిపడా సంఖ్యలో ఆరోగ్య సదుపాయాలు, వైద్యులు లేని దృష్ట్యా తాము ఈ హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. నేటి కాలంలో క్యాన్సర్ చికిత్సలో నిత్యం కొత్త ఔషధాలు, సరికొత్త థెరపీలు వస్తున్నాయని, ఇలాంటి సమయంలో వైద్యుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం అమూల్యమైనదని గుప్తా అభిప్రాయపడ్డారు.