(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. మద్యం విధానానికి సంబంధించి నిజానిజాలను తన భర్త కేజ్రీవాల్ గురువారం (మార్చి 28) కోర్టులో బయటపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె వీడియో సందేశం విడుదల చేశారు.
‘మద్యం కేసుకు సంబంధించి గడిచిన రెండేండ్లలో ఈడీ ఇప్పటివరకు 250 సార్లు సోదాలు జరిపినట్టు కేజ్రీవాల్ చెప్పారు. అయితే, ఇప్పటివరకూ ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదు. మా ఇంట్లోనూ ఈడీ సోదాలు జరిపింది. అయితే కేవలం రూ. 73 వేలు మాత్రమే దొరికాయి. మద్యం కేసులో కుంభకోణం జరిగినట్టు చెప్తున్నారు కదా? మరి ఆ డబ్బంతా ఏమయ్యింది? ఈ కేసుకు సంబంధించి అన్ని నిజాలను కోర్టులో బయటపెడతానని కేజ్రీవాల్ నాతో చెప్పారు. లిక్కర్ పాలసీ డబ్బు ఎక్కడుందో ఆయన జడ్జి ముందు చెప్తారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారు’ అని సునీత వీడియోలో వెల్లడించారు.
జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడాన్ని బీజేపీ నేతలు విమర్శిస్తుండటంపై కూడా సునీత మాట్లాడారు. ‘కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన డయాబెటిస్తో బాధపడుతున్నారు. కస్టడీ నుంచే నీటి సమస్యను నివారించాలని ఆయన రెండు రోజుల క్రితం మంత్రి ఆతిశీకి లేఖ పంపారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద సమస్యగా చేస్తున్నది. ఆయనపై కొత్త కేసులు పెడుతున్నది. ఢిల్లీని నాశనం చేయాలని కేంద్రం కోరుకుంటున్నది’ అని సునీత మండిపడ్డారు.