న్యూఢిల్లీ : శీతాకాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో అల్లాడుతోంది. పొగమంచుకు తోడు వాహనాల నుంచి వెలువడే పొగతో తదిత కారణాలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మధ్యస్థ, డీజిల్తో నడిచే భారీ వాహనాలకు ఢిల్లీలో ప్రవేశంపై నిషేధం విధించింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2023, ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిషేధం అమలులో ఉండనున్నది.
ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్సీఆర్ నుంచి వచ్చే నుంచి వచ్చే గూడ్స్ వాహనాలు ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని ఓ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఐదు నెలల పాటు వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా రోజుల్లో గాలి నాణ్యత అధ్వాన్న స్థితికి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఢిల్లీ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్లకు లేఖ రాసింది. ఢిల్లీలోకి బీఎస్-6 బస్సులను మాత్రమే అనుమతించాలని లేఖలో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇదిలా ఉండగా.. ప్రతి సంవత్సరం చలికాలం ప్రారంభం నుంచే గాలి నాణ్యత పడిపోతూ వస్తున్నది. దీంతో ఢిల్లీ వాసులు ఊపిరి పీల్చుకోవడం సైతం కష్టంగా మారుతున్నది.
వాతావరణ పరిస్థితులతో పాటు ఎన్సీఆర్లో జరుగుతున్న కార్యకలాపాలు చెత్తాచెదారం, రోడ్లపై దుమ్ము, వాహనాల నుంచే వెలువడే పొగ కారణంగా గాలి నాణ్యత పడిపోతూ వస్తున్నది. ఈ క్రమంలో కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం శీతాకాలం కోసం ఈ సారి ముందస్తుగానే ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. ఏటా చెత్తను కాల్చడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారబోయడం, రోడ్లపై దుమ్ము ఎగురకుండా నీరు చల్లడంతో పాటు హాట్స్పాట్లను గుర్తించి.. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.