ముంబై, జూలై 18: భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని అల్లకల్లోలమైంది. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిసింది. పిడుగుపాట్లతో పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇండ్లు కూలాయి. నగర శివారుల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో 33 మంది మరణించారు. చెంబూర్లో శనివారం అర్థరాత్రి కొండ చరియలు విరిగి ఇండ్ల మీద పడిన ఘటనలో 19 మంది మృతిచెందగా, విఖ్రోలిలో గోడ కూలి 10 మంది మరణించారు. చెంబూర్ ప్రాంతంలోని భరత్నగర్ కొండ ప్రాంతం. కొండకు సమీపంలో ఇండ్లు ఉన్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగి కొన్ని ఇండ్లపై పడ్డాయి. దీంతో 19 మంది మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విఖ్రోలిలో భారీ వర్షానికి ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో పది మంది మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలోని బందప్ ప్రాంతంలో గోడ కూలిన ఘటనలో 16 ఏండ్ల బాలుడు మృతి చెందాడు. విద్యుత్ షాక్ తగిలి మరో ముగ్గురు మరణించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంతాపం తెలిపారు.
3 గంటల్లో 25 సెంటీమీటర్లు
ముంబైలో శనివారం అర్థరాత్రి మూడు గంటల వ్యవధిలోనే 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 7 గంటల వరకు 30.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. భారీ వర్షాలతో నగరవీధులు నదులను తలపించాయి. చాలాచోట్ల కార్లు, స్కూటర్లు నీటిలో కొట్టుకుపోయాయి.
ముంబైని పిడుగులు హడలెత్తించాయి. 60 వేల అడుగుల ఎత్తు నుంచి (రెండు ఎవరెస్టు శిఖరాల ఎత్తుతో సమానం) పిడుగులు పడ్డట్టు ఐఎండీ తెలిపింది. 2005 తర్వాత ఈ స్థాయిలో పిడుగులు పడటం ఇదే ప్రథమం.
2005 జూలై 26న ముంబైలో ఒక్కరోజులో 944 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నిచ్చెన మీదే రెండు గంటలు
ముంబై భరత్నగర్ ఏరియాలో వర్షం బీభత్సం సృష్టించగా కరెంట్ షాక్ తగులుతుందేమోనన్న భయంతో ఇద్దరు మహిళలు వారి ఇంటిలో రెండు గంటలకు పైగా నిచ్చెన మీదే నిల్చున్నారు. కొండచరియలు విరిగిపడటంతో పాటు కరెంటు స్తంభాలు కూడా పడిపోయాయని, నీళ్ల ద్వారా విద్యుత్తు ప్రవహిస్తున్నదని చుట్టుపక్కల వాళ్లు అరవడంతో ఆ మహిళలు నిచ్చెన ఎక్కారు.