భోపాల్ : మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ధార్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ డ్యాంకు వరద పోటెత్తింది. దీంతో ఆ ప్రాజెక్టుకు గండి పడే అవకాశం ఉంది. మెల్లమెల్లగా మట్టి కొట్టుకుపోతోంది. ఈ క్రమంలో ఆ ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న 11 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాజెక్టును రూ. 304.4 కోట్ల వ్యయంతో చేపట్టారు. నాలుగేండ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ డ్యాం పూర్తయితే.. 52 గ్రామాలకు సాగునీరు అందించనున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో జల వనరుల శాఖ మంత్రి తులసి సిలావత్ ధార్లో నిర్మాణంలో ఉన్న డ్యాంను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే రాజవర్ధన్ సింగ్తో కలిసి మంత్రి చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు అక్కడే ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు రాకుండా ఉండేందుకు చేపట్టిన చర్యలు విఫలం అయ్యాయి. డ్యామ్ పొడవు 590 మీటర్లుకాగా, ఎత్తు 52 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 15 ఎంసీఎంల వాటర్ ఉందని అధికారులు పేర్కొన్నారు.