న్యూఢిల్లీ: దేశంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలతోపాటు వడగండ్లు పడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేసింది. ముఖ్యంగా ఈ నెల 2, 3 తేదీల్లో అరుణాచల్ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీల్లో వడగండ్లు ఎక్కువగా పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నెల 2న పశ్చిమబెంగాల్లో కూడా వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక దక్షిణ భారతదేశం విషయానికి వస్తే.. మే 1న కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా మే 1 నుంచి 3వ తేదీ వరకు దక్షిణ కర్ణాటక, కోస్తాంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది. మే 1, 2 తేదీల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.