Uttar Pradesh | లక్నో : ఉత్తరప్రదేశ్లో వాన బీభత్సం సృష్టించింది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు 34 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లోనే 10 మంది చనిపోయినట్లు యూపీ అధికార యంత్రాంగం వెల్లడించింది. యూపీ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం.. 34 మందిలో 17 మంది పిడుగుపాటుకు గురయ్యారు. 12 మంది మునిగిపోగా, ఐదుగురు వరదల్లో కొట్టుకుపోయారు.
వాన బీభత్సంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ముంపు బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, ఆశ్రయం కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని గంగా, రామ్ గంగా, యమునా, రాప్తి నదులు ఉధృతంగా ప్రవాహిస్తున్నాయి.