న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కుంభవృష్టి కురుస్తున్నది. శనివారం కుండపోత వాన ఢిల్లీ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆదివారం వారం కూడా ఎడతెగకుండా వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రహదారులు జలమయమయ్యాయి. అక్కడక్కడ రోడ్లపై భారీగా నీరు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే, సోమవారం నుంచి ఢిల్లీలో వరుణుడి ప్రభావం కొంత మేరకు తగ్గవచ్చునని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, ఢిల్లీలో కుంభవృష్టిపై ట్విట్టర్లోనూ మీమ్స్ వర్షం కురుస్తున్నది. వర్షం వల్ల బాలీవుడ్ మొదలు ఛాయ్, బ్రెడ్, పకోడి వాలా వరకు ప్రజలందరికీ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది.
ఓ ట్విట్టర్ యూజర్ పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ ఫొటోను షేర్ చేస్తూ మెయ్న్ రుకేగా నహీ సాలా అనే మీమ్ను జతచేశాడు. ఢిల్లీలో సీజనల్ వాటర్ ఫాల్స్ వచ్చాయని, ఢిల్లీ వాసులంతా ఫ్రీ కార్ వాష్ కోసం రోడ్లపైకి వస్తున్నారని మరో ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశాడు.