Heat waves @ Rajasthan | దేశంలోని చాలా ప్రాంతాలు చలి గుప్పిట్లో వణుకుతుండగా.. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ఎండ వేడిమికి భయపడిపోతున్నది. నవంబర్ నెలలో ఎండలేంటి అని ప్రజలు ముచ్చటించుకుంటున్నారు. రాజస్థాన్లోని సిరోహీలో రికార్డు స్థాయిలో ఎండ వేడిమి నమోదైంది. ఇక్కడ అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ జిల్లాల్లో కూడా అత్యధిక వేడిమి నమోదైంది. పనుల నిమిత్తం బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. మరో మూడు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దేశంలో 14 ఏళ్ల తర్వాత నవంబర్లో పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. 2008 లో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఈ ఏడాది నవంబర్ 7 న 33.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు 2001 లో ఇదే నెలలో గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలు నమోదైంది. కాగా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, లడఖ్లో నవంబర్ 12, 13 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావం కనిపించనున్నది. దక్షిణ భారతదేశంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, ఈ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది.
రాజస్థాన్లో ఈసారి సీజన్ ప్రారంభంలోనే ఎండల తీవ్రత కనిపించింది. జైపూర్, అజ్మీర్, ఉదయ్పూర్ సహా 10కి పైగా నగరాల్లో నవంబర్ తొలినాళ్లలో రోజువారీ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. నవంబర్ 5 న సిరోహీలో గరిష్ట ఉష్ణోగ్రత అన్ని రికార్డులను బద్దలు కొట్టి 40 డిగ్రీల సెల్సియస్ను దాటింది. కాగా, మధ్యప్రదేశ్లోని మాండ్లాలో అత్యల్పంగా 10.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.