లక్నో, జనవరి 19: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులకు యోగి సర్కారు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో పూట గడవక, గత్యంతర లేక ఉద్యోగులు నిరసనబాట పడుతున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులను మొదలుకొని.. ఆశా వర్కర్లు, జల్నిగమ్ ఉద్యోగులు, స్ట్రీట్లైట్ వర్కర్లు.. ఇలా వందల మంది ఉద్యోగులు తమకు వేతనాలు చెల్లించాలంటూ ఆందోళన చేపడుతున్నారు. అయినప్పటికీ బీజేపీ సర్కారు వీరి గోడును పట్టించుకోవడం లేదు.
జల్నిగమ్ ఉద్యోగులు
ఉత్తరప్రదేశ్ జల్నిగమ్ ఉద్యోగులకు యోగి సర్కారు గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. గత ఆగస్టులో వారు చివరిసారిగా వేతనం అందుకున్నారు. ప్రభుత్వం నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వందల మంది ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణకు, పిల్లల చదువులకు, రుణాల చెల్లింపుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా గత ఏడాది సెప్టెంబర్ నుంచి పెన్షన్ అందడం లేదు.
మధ్యాహ్న భోజన కార్మికులు
మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే రూ.2 వేల వేతనాన్ని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత ఆరు నెలలుగా చెల్లించడం లేదు. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని మిడ్డే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంఘాలు పదేపదే యోగిసర్కారుకు లేఖలు రాసినప్పటికీ ఫలితంగా లేకుండా పోయింది. దీంతో ఉపాధ్యాయులే తమ సొంత డబ్బులతో మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకుంటున్నారు.
సెక్యూరిటీ గార్డులు
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఆర్ఎంఎల్ఐఎంఎస్)కు చెందిన సెక్యూరిటీ గార్డులకు ప్రభుత్వం ఆరు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. ఇచ్చే అరకొర జీతం కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంటికి అద్దె కూడా చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు.
శిక్షామిత్రలు
తమకు గౌరవ వేతనం పెంచాలని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని శిక్షామిత్రలు నిరసన చేపడుతున్నారు. తమకు 12,000 కూడా అందడం లేదని వాపోతున్నారు. ఆ ఇచ్చే మొత్తాన్ని కూడా నాలుగు నెలలు ఆలస్యంగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలు ఎలా బతుకీడ్చాలని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
స్ట్రీట్ లైట్ వర్కర్లు..
స్ట్రీట్ లైట్ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని యూపీ సర్కారు గత ఆరు నెలలుగా చెల్లించడం లేదు. దీంతో అరకొర జీతం అందే కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమ గోడును ఎన్నిసార్లు వెల్లబోసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో పెన్-డౌన్ చేపట్టి నిరసన తెలిపారు.
ఆశా వర్కర్లు
ఆశావర్కర్లకు కూడా ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. నెలల తరబడి ఆలస్యం చేస్తున్నది. దీంతో అనేకసార్లు వందలమంది ఆశావర్కర్లు సమ్మె చేపట్టారు. అయినా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదు.