NEET PG Cut Off | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: నీట్ పీజీ-2023 కటాఫ్ తగ్గింపుపై వివాదం రేగింది. కేంద్ర వైద్య శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తన కుమార్తెకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కటాఫ్ను జీరోకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్ర మంత్రి కూతురు దిశా మాండవీయకు పీజీ సీటు దక్కాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు సైతం కటాఫ్ తగ్గింపుపై అనుమానాలు వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఈ వివాదంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నీట్ పరీక్షలో జీరో మార్కులు వచ్చినప్పటికీ సీటు వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం షాక్కు గురి చేసింది. బీజేపీ నేతల పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకే కటాఫ్ను జీరోకు తగ్గించినట్టు అనుమానం వస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను మాండవీయ ఖండించారు.