న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి వల్ల కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మన దేశంలోనూ కలవరం మొదలైంది. గత అనుభావాల ఆధారంగా వచ్చే నెలలో కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో రానున్న 40 రోజులు మన దేశానికి చాలా కీలకమని అధికారవర్గాలు బుధవారం హెచ్చరించాయి. గతంలో కొవిడ్ కొత్త వేవ్ తూర్పు ఆసియాలో మొదలైన 30-35 రోజుల తర్వాత భారత్కు చేరిందని ఓ అధికారి తెలిపారు.
పాత వేరియంట్లతో పోలిస్తే బీఎఫ్-7 వేరియంట్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుందని, దీని బారిన పడిన ఒక్కో వ్యక్తి వల్ల మరో 16 మందికి ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉన్నదని ఆ అధికారి వివరించారు. అయితే ఈ సారి కొవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రత పెద్దగా ఉండదని, ఒకవేళ మరో వేవ్ మొదలైనా మరణాలు, దవాఖానల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు.
39 మందికి పాజిటివ్..
గత రెండు రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన దాదాపు 6 వేల మంది ప్రయాణికులకు ర్యాండమ్గా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 39 మందికి పాజిటివ్ తేలినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ గురువారం ఢిల్లీ విమానాశ్రయాన్ని సందర్శించనున్నారు.
వారికి నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి
ఒకవైపు చైనా మరికొన్ని దేశాల్లో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో మనదేశం అప్రమత్తమైంది. చైనా, మరో ఐదు దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాలనే నిబంధనను తీసుకురానున్నది. దీనిలో భాగంగా అంతర్జాతీయ ప్రయాణికులు సువిధ ఫామ్లను నింపడం, 72 గంటల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు సమర్పించడం తదితర నిబంధనలు వచ్చేవారం నుంచి తేనున్నది. చైనా, జపాన్, సౌత్ కొరియా, హాంగ్కాంగ్, థాయిలాండ్, సింగపూర్ నుంచి వచ్చేవారికి దీనిని అమలు చేయనున్నారు. కాగా, విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఇప్పటికే కొవిడ్ ర్యాండమ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.