పాట్నా, ఫిబ్రవరి 18: దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత అవసరాన్ని బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్కుమార్ మరోసారి నొక్కిచెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నీ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏకమవ్వాలని సూచించారు. ఈ ‘యునైటెడ్ ఫ్రంట్’తో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సీట్లను 100 కంటే తగ్గించవచ్చునని పేర్కొన్నారు. పాట్నాలో పలు ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరైన ఓ కార్యక్రమంలో నితీశ్ మాట్లాడుతూ.. ఐక్య కూటమిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తనకు ప్రధాని అవ్వాలనే ఆశ లేదని మరోసారి నితీశ్ స్పష్టం చేశారు.