బెంగళూర్ : యోగి ఆదిత్యానాధ్ మోడల్ కర్నాటకలో ఫలించబోదని మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. కర్నాటకను బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మత ఘర్షణల, హింసను నివారించేందుకు అవసరమైతే తాను యోగి ఆదిత్యానాధ్ మోడల్ను అనుసరిస్తానని సీఎం బసవ్రాజ్ బొమ్మై వ్యాఖ్యల నేపధ్యంలో కుమారస్వామి ఈ ప్రకటన చేశారు.
దక్షిణ కన్నడలో మంగళవారం బీజేపీ యువ మోర్చా సభ్యుడు ప్రవీణ్ నెత్తారు హత్యతో కర్నాటకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేయిమంది మోదీలు వచ్చినా ఇక్కడ వారి మోడల్ వర్కవుట్ కాదని కుమారస్వామి తేల్చిచెప్పారు. ఇక బీజేపీ కార్యకర్త హత్యను సీఎం బొమ్మై ప్రస్తావిస్తూ యూపీలో పరిస్ధితులను సమర్ధంగా ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యానాధ్ సరైన సీఎం అని వ్యాఖ్యానించారు.
బీజేపీ కార్యకర్త హత్య కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీఎం వారికి రూ 25 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రవీణ్ నెత్తారు హత్య కేసులో మంగళూరు పోలీసులు గురువారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.