Karnataka | బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనేది కుమారస్వామి భ్రమ అని సీఎం పేర్కొన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీజేపీ, జేడీఎస్ నాయకులు.. నీళ్లు లేని బావిలో చేపల మాదిరిగా విలవిలలాడిపోతున్నారని సిద్ధరామయ్య విమర్శించారు. బీజేపీ, జేడీఎస్ కలిసి 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్పై పోరాడేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఆ రెండు పార్టీలు ఏకమైనప్పటికీ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో అటు నాయకులు, ఇటు ప్రజలు సంతృప్తిగా లేరని కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య కేబినెట్లోని ఒక మంత్రి.. 50-60 మంది ఎమ్మెల్యేలతో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలనుందని కుమారస్వామి పేర్కొన్నారు.