న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఒక న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆయనను మందలించడంతోపాటు రూ.10,000 జరిమానా కూడా విధించింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్దా వాకర్ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా ఈ ఏడాది మే నెలలో దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఫ్రిజ్లో దాచిన శరీర భాగాలను పలు ప్రాంతాల్లో పడేశాడు. నిందితుడు ఆఫ్తాబ్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ దారుణం గురించి అతడే వెల్లడించాడు. దీంతో ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
కాగా, శ్రద్ధా వాకర్ హత్యపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఒక న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ హత్య కేసును ఢిల్లీ పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. ఫోరెన్సిక్ ఆధారాలను భద్రపరచలేదని, దర్యాప్తు జరుగుతున్న తీరు గురించి రిట్ పిటిషన్లో ఎక్కడా పేర్కొనలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో శ్రద్ధా వాకర్ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని ఆయన కోరారు.
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్లతో కూడిన ధర్మాసనం, నవంబర్ 22న ఈ పిల్ను తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని, కేవలం 44 శాతం హత్య కేసుల్లో మాత్రమే దోషిగా తేలిందని చెప్పడం ద్వారా ప్రతి కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరడంలో అర్థం లేదని, ఈ ఆరోపణలు దురదృష్టకరమని పేర్కొంది. పోలీసుల నైతికతను ప్రభావితం చేస్తే ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించకూడదని వ్యాఖ్యానించింది.
అలాగే న్యాయ వ్యవస్థపై సాధారణ ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఇలాంటి నిరాధార ఆరోపణలు దెబ్బతీస్తాయని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. శ్రద్ధా వాకర్ హత్య కేసు 80 శాతం పూర్తైనట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారని, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న 200 మందితో కూడిన పోలీస్ బృందం మిగతా శరీర భాగాల కోసం వెతుకుతున్నారని తెలిపింది. ఈ దశలో వారి మనోస్థైర్యాన్ని దెబ్బ తీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని పేర్కొంది.
మరోవైపు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను దుర్వినియోగం చేయడంపైనా ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్లిసిటీ కోసం వక్ర ఉద్దేశాలతో వీటిని దాఖలు చేస్తున్నారని మండిపడింది. పిల్ పవిత్రతను కాపాడేందుకు ఇలాంటి విజ్ఞప్తులను మొగ్గలోనే తుంచేయాలని కోర్టు పేర్కొంది. ఈ పిల్ దాఖలు చేసిన న్యాయవాదిపై ఈ మేరకు గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు రూ.10,000 జరిమానా కూడా కోర్టు విధించింది.