న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హవాలా నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద హవాలా నేరాలపై మాత్రమే దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హవాలాతో సంబంధమున్న ఇతర నేరాలపై సంబంధిత సంస్థలు దర్యాప్తు చేస్తాయని పేర్కొంది. ఆ నేరాలను కూడా తానే దర్యాప్తు చేస్తానంటూ ఈడీ బలవంతంగా చొరబడకూడదని తెలిపింది.
పీఎంఎల్ఏ సెక్షన్ 3లో పేర్కొన్న నేరాలను దర్యాప్తు చేసే అధికారం మాత్రమే ఈడీకి ఉన్నదని తేల్చి చెప్పింది. ఈడీకి ఉన్న అధికారాలు హవాలా నేరాల దర్యాప్తునకు మాత్రమే పరిమితమై ఉన్నాయని స్పష్టం చేసింది. హవాలా కేసు దర్యాప్తులో ఏవైనా ఇతర సాక్ష్యాధారాలు తన చేతికి చిక్కితే.. అంతకుముందే మరో నేరం జరిగిందన్న అంచనాకు అది రాకూడదని తెలిపింది.