న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే, గదిలోపలే వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందన్న లాన్సెట్ అధ్యయనం అత్యంత ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. ‘గదిలో గాలి, వెలుతురు (వెంటిలేషన్) సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. గదిలోని ఒక్కరికి కరోనా సోకినా అందరికీ వ్యాపించే ప్రమాదమున్నది’ అని తెలిపారు. కరోనా రోగి 10 మీటర్ల దూరం కూర్చున్నప్పటికీ, ఇతరులకు వైరస్ సోకే ప్రమాదముంటుందని, దీనికి కారణం గాలిలో కరోనా ప్రయాణించడమేనన్నారు. రోగి తుమ్మడం, దగ్గడం వల్ల వైరస్ మరింత ఎక్కువ దూరం ప్రయాణించవచ్చన్నారు. తుమ్మడం, దగ్గడం చేసిన అనంతరం రోగి గది నుంచి బయటకు వెళ్లిపోయినప్పటికీ, వైరస్ గదిలోపల ఉంటుందని పేర్కొన్నారు. ముక్కు, నోటిని కప్పి ఉంచేలా మాస్కులను ధరించాలన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో డబుల్ మాస్కును ధరించాలన్న వార్తలపై స్పందిస్తూ.. ఎన్-95 ఒక్క మాస్కును ముక్కు, నోరు మూసి ఉంచేలా ధరిస్తే చాలన్నారు.