ముంబై: విమానం ఎక్కిన ప్రయాణికుడు తన సీటు కింద బాంబు ఉందని బెదిరించాడు. (Bomb Under My Seat) దీంతో ఆ విమానంలో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి వేళ ముంబై నుంచి లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానంలోకి 27 ఏళ్ల వ్యక్తి ఎక్కాడు. సీటులో కూర్చొన్న అతడు తన సీటు కింద బాంబు ఉందని అన్నాడు.
కాగా, ఇండిగో విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారంతా కలిసి ఇండిగో విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ఆ విమానంలో ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. తన సీటు కింద బాంబు ఉందని చెప్పిన ఆ ప్రయాణికుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడు ఎందుకు అలా అన్నాడు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ఆ ఇండిగో విమానం చాలా ఆలస్యంగా ముంబై విమానాశ్రయం నుంచి లక్నోకు బయలు దేరింది.