న్యూఢిల్లీ, మార్చి 29: రాజకీయ నాయకులు మత రాజకీయాలు చేయటం ఆపేస్తే, విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట పడుతుందని సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. విద్వేష ప్రసంగాల్ని ‘విష వలయం’తో పోల్చింది. ఈ విష వలయంలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం సూచించింది. ‘రాజకీయాల్లో మతాన్ని కలుపుతూ రాజకీయ నాయకులు చేస్తున్న ప్రసంగాలతోనే సమస్యంతా. మతాన్ని, రాజకీయాల్ని వేరుగా చూడటం మొదలైతే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడటం ఆపేస్తే, విద్వేష ప్రసంగాలు వాటంతటవే ఆగిపోతాయి’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టడంలో విఫలమయ్యాయని, ఎఫ్ఐఆర్ నమోదు చేయటం లేదని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కొంతమంది సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్లపై బుధవారం విచారణ జరుపుతూ, రాజకీయాల్లో మతం ప్రస్తావన తీసుకురావటం ఆగితే.. విద్వేష ప్రసంగాలు వాటంతటవే ఆగిపోతాయని ధర్మాసనం పేర్కొంది. టీవీ, ఇతర వేదికలపై ప్రతిరోజూ విద్వేష ప్రసంగాలు చూస్తేనే ఉన్నాం. ఎంతమందిపైన కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోగలం అని ప్రశ్నించింది.