చండీగఢ్: పంజాబ్, హర్యానాలో పంటల కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన ఎండు గడ్డి, పంట వ్యర్థాలను రైతులు తగులబెడుతున్నారు. ఈ పొగ కాలుష్యం ఢిల్లీలో గాలిని కలుషితం చేస్తున్నది. ప్రతి ఏటా పరిపాటిగా మారిన దీనిని అడ్డుకునేందుకు ఆయా రాష్ట్రాల వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
హర్యానాలోని కైతాల్లో పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని అడ్డుకున్నారు. గడ్డి పోగులకు రైతులు పెట్టిన మంటలను వ్యవసాయ శాఖ అధికారులే స్వయంగా ఆర్పివేశారు.
కాగా, పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నివారించేందుకు గత కొన్నేళ్లుగా రైతుల సహకారంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కైతాల్ వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కరమ్ చంద్ తెలిపారు. దీంతో యాక్టివ్ ఫైర్ లొకేషన్స్ చాలా వరకు తగ్గినట్లు చెప్పారు. గ్రామాలను మూడు భాగాలుగా విభజించామని, రైతులకు వ్యవసాయ పరికరాలను అందజేయడంతోపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.