Buchi Babu Sana | ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన ఇప్పుడు ‘పెద్ది’ సినిమాతో మరో భారీ హిట్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తరువాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ స్టార్ హీరోతో ఉండబోతోందన్నదానిపై ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్లో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు ఒక్క సినిమాతోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. యూత్ఫుల్ ప్రేమకథతో పాటు బలమైన ఎమోషనల్ కంటెంట్తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో బుచ్చిబాబు పేరు టాలీవుడ్లో బలంగా వినిపించింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం పెద్ది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనున్నారు.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘పెద్ది’ సినిమా పూర్తయ్యేలోపే ఆయన రెండు కొత్త కథలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక కథను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం సిద్ధం చేశారట. ఇటీవల ప్రభాస్ను కలిసి ఆ కథను వినిపించగా, స్టోరీ ఆయనకు బాగా నచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక మరో కథను యువ హీరో అఖిల్ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి అఖిల్తో సినిమా చేయాలని భావిస్తూ బుచ్చిబాబును సంప్రదించిందట. అందుకు తగ్గట్టుగానే అఖిల్కు సరిపోయే కథను కూడా ఆయన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
దీంతో ‘పెద్ది’ సినిమా తర్వాత బుచ్చిబాబు రెండు భారీ ప్రాజెక్ట్లతో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ముందుగా ఎవరి డేట్స్ అందుబాటులోకి వస్తాయో వారి తోనే తదుపరి సినిమా ప్రారంభించేలా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ‘ఉప్పెన’తో సూపర్ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు, ఇప్పుడు ‘పెద్ది’తో మరో భారీ విజయం అందుకోవాలని చూస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ లేదా అఖిల్లతో వచ్చే ప్రాజెక్ట్పై కూడా అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.