Cockroach Janata Party : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మీద విస్తృతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్లో సెటైరికల్గా మొదలైన సీజేపీ ఇప్పుడు ఉద్యమంలా మారింది. దీని చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. తాజాగా ఈ పార్టీకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పార్టీని తనపేరు మీద రిజిష్టర్ చేయాలంటూ హరియాణాలని పానిపట్కు చెందిన సుధీర్ జకార్ అనే ఒక లాయర్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాడు.
మరోపక్క ఈ పార్టీ తనది అంటూ అమెరికా నుంచి వచ్చిన అభిజిత్ దీప్కే అనే భారతీయుడు చెప్పుకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పార్టీ అభిజిత్ దీప్కే, సుధీర్ జకార్లలో ఎవరిది అనే అంశం చర్చకు వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సుధీర్ జకార్.. తనను తాను సీజేపీకి నేషనల్ కన్వీనర్ అని చెప్పుకొంటూ ఈసీ వద్ద దరఖాస్తు దాఖలు చేశాడు. సెక్షన్ 29ఏ ప్రకారం ఈ పార్టీని రిజిష్టర్ చేయాలంటూ కోరాడు. ఈ దరఖాస్తుపై సీజేపీ లోగా కూడా ఉండటం విశేషం. ఒకవేళ ఈసీ ఈ దరఖాస్తును పరిశీలించి, అతడిపేరు మీదే రిజిష్టర్ చేస్తే పార్టీ సోషల్ మీడియా ఖాతాలు కూడా ఆయనకే దక్కుతాయి. ఇటీవల భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువత కాక్రోచ్లతో సమానం అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీజేపీ ప్రారంభమైంది.
భారతీయ యువతను సీజేఐ తక్కువ చేశారంటూ ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. అయితే, వాటిని ఆ తర్వాత ఆయన ఖండించారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారు. సీజేపీ అకౌంట్ ఎక్స్లో ప్రారంభమైన ఐదురోజులకే నిషేధానికి గురైంది. తర్వాత మరో కొత్త అకౌంట్ను సీజేపీ లాంఛ్ చేసింది. రోజుల వ్యవధిలోనే ఈ అకౌంట్కు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు వచ్చి చేరారు. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న పార్టీగా సీజేపీ నిలిచింది.