కురుక్షేత్ర, సెప్టెంబర్ 23: బీజేపీ పాలిత హర్యానాలో రైతన్నలు మరోసారి రోడ్డెక్కారు. వరి, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోలులో ఆలస్యాన్ని నిరసిస్తూ.. తక్షణం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలన్న డిమాండ్తో శుక్రవారం కురుక్షేత్ర జిల్లాలోని షహాబాద్లో వందలాది మంది రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. రైతులు రాత్రి వరకు రహదారిపైనే బైఠాయించడంతో హైవేపై పెద్దయెత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే పంట కొనుగోలు చేపట్టడంతో పాటు వరి కొనుగోలును ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్లకు పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. హర్యానా బీకేయూ(ఛాదుని) ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ మాట్లాడుతూ మా డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని, హైవే దిగ్బంధనాన్ని ఉపసంహరించుకొనేది లేదని పేర్కొన్నారు.
సమస్యలపై ఎన్నిసార్లు అభ్యర్థించినా ప్రభుత్వం పట్టించుకొన్న పాపాన పోలేదని మండిపడ్డారు. పంట ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ చేసుకునే సదుపాయాలు తమకు లేవని, కొనుగోలు తేదీని ముందుకు జరుపాలని రైతులు అంతకుముందు ప్రభుత్వాన్ని కోరారు. అయితే బీజేపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. ఏజెన్సీలు కొనుగోళ్లు ఇంకా ప్రారంభించకపోడంతో మండీల్లోని తమ పంట మగ్గిపోతున్నదని, తేమ శాతం పెరుగడంతో అంబాలా, కైథాల్, ఇతర జిల్లాల్లోని మార్కెట్లలో వందల క్వింటాళ్ల వరి ధాన్యం నాశమైందని రైతులు చెబుతున్నారు. వరి పంట ఇప్పటికే పెద్దయెత్తున మండీలకు చేరినా.. బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు ప్రక్రియను ప్రారంభించకపోవడం గమనార్హం.