చండీఘఢ్ : హర్యానాలో మైనింగ్ మాఫియా చెలరేగుతోంది. డీఎస్పీ సురేంద్ర సింగ్ను మైనింగ్ మాఫియా వాహనంతో ఢీకొట్టి చంపడం పట్ల కాంగ్రెస్ మనోహర్లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఖట్టర్ రాష్ట్రాన్ని ఎలా మార్చాలని కోరుకుంటున్నారని కాంగ్రెస్ నిలదీసింది.
కాషాయ సర్కార్ హయాంలో ఎమ్మెల్యేలు, పోలీసులకే రక్షణ కరవైతే ఇక సామాన్య ప్రజల సంగతేంటని ప్రశ్నించింది. మరోవైపు డీఎస్పీ సురేంద్ర సింగ్ మరణానికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు చేపడతామని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. కాగా ఆరావళి కొండల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన డీఎస్పీని మైనింగ్ మాఫియా బలిగొంది.
ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న తౌడు డీఎస్పీ సురేందర్ సింగ్ పై డంపర్ డ్రైవర్ తన వాహనాన్ని తీసుకువెళ్లాడు. పేపర్లు తనిఖీ చేసేందుకు వాహనాన్ని అడ్డుకోగా.. దాని డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. ఇద్దరు పోలీసులతో తౌరు వెళ్లిన డీఎస్పీకి చేదు అనుభవం ఎదురైంది. అనుమానిత డంపింగ్ వాహనాన్ని గుర్తించి దాన్ని ఆపేందుకు డీఎస్పీ ప్రయత్నించారు. ఆ సమయంలో వాహనం డీఎస్పీని తాకింది. గాయపడ్డ డీఎస్పీని హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు తేల్చారు. నుహ్ జిల్లాలో అక్రమ మైనింగ్ ఎక్కువ. అక్కడ ప్రతి ఏడాది కనీసం 50 ఫిర్యాదులు అందుతున్నాయి.