న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాదిగా నిరసనలు చేస్తూ రైతులు అడ్డుకున్న జాతీయ రహదారులను తెరుస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. హర్యానా, ఢిల్లీ సరిహద్దులోని సింఘూ, టిక్రీలో రైతులు నిరసన చేస్తున్న జాతీయ రహదారుల పునరుద్ధరణపై అమిత్ షాతో చర్చించారు. హర్యానాలోని అనేక చోట్ల రైతులు చేస్తున్న నిరసనల గురించి కూడా ఆయనతో మాట్లాడినట్లు అనంతరం మీడియాకు తెలిపారు. సరిహద్దులను తిరిగి తెరువడంపై ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.
మరోవైపు హర్యానాలో ఎక్కడా కూడా పంట వ్యర్థాలను రైతులు తగులబెట్టడం లేదని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. పంట వ్యర్థాల అమ్మకాన్ని ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ.1,000ను రైతులకు చెల్లిస్తున్నట్లు వివరించారు.