చంఢీగఢ్: కటుంబకలహాలు ఐదు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంటి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. భార్యకు, తన ఇద్దరు పిల్లలకు, మేన కోడలుకు విషమిచ్చి చంపేశాడు. అనంతరం తను కూడా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా మారిపోయారు. ఈ ఉదయం 7.30 గంటలకు మృతుడి తండ్రి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. హర్యానాలోని పల్వాల్ జిల్లా ఔరంగాబాద్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 33 ఏండ్ల వ్యక్తి గత కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో కలతచెందాడు. ఈ క్రమంలో భార్యకు, 11 ఏండ్ల కొడుకుకు, ఏడేండ్ల బిడ్డకు, తొమ్మిదేండ్ల వయసున్న మేనకోడలుకు విషమిచ్చి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లోంచి ఎవరూ బయటికి రాకపోవడంతో అనుమానించిన మృతుడి తండ్రి వెళ్లి చూడగా అందరూ ఒకే గదిలో విగతజీవులుగా పడివున్నారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.