చండీఘఢ్ : పంజాబ్లో భగవంత్ మాన్ సారధ్యంలోని ఆప్ సర్కార్ను కూల్చేందుకు కాషాయ పార్టీ కుట్రపన్నిందని పాలక ఆప్ ఆరోపించింది. పది మంది ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ 20-25 కోట్లు ఆఫర్ చేసిందని పంజాబ్ ఆర్ధిక మంత్రి హర్పాల్ సింగ్ చీమ పేర్కొన్నారు. ఆపరేషన్ లోటస్లో భాగంగా బీజేపీ కొందరు ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిందని ఆరోపించారు. డబ్బు, మంత్రి పదవుల ఆశ చూపి ఏడెనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిందని వెల్లడించారు.
బీజేపీ కేంద్ర నేతల ఆదేశంతో కొందరు ఆ పార్టీ నేతలు తమ ఎమ్మెల్యేలను ఫోన్ ద్వారా సంప్రదించి బేరసారాలకు దిగారని, ఆప్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారని హర్పాల్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీలో అగ్ర నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, ఒక్కొక్కరికి రూ 25 కోట్లు ఇస్తామని మరికొంత మంది ఎమ్మెల్యేలను తీసుకువస్తే మరింత డబ్బు ముట్టజెబుతామని నమ్మబలికారని వివరించారు.
పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ పలుమార్లు ప్రయత్నించిందని అన్నారు. అయితే ఏయే ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందనే వివరాలను ఆయన వెల్లడించలేదు. సరైన సమయంలో తమ ఆరోపణలకు తగిన ఆధారాలను చూపుతామని స్పష్టం చేశారు.