న్యూఢిల్లీ : 2024లో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, ఆపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాషాయ పార్టీని మట్టికరిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ ప్రజల మద్దతు ఉన్న నేతను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తారని చెప్పారు.
2024 నాటికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా వేస్తుందని ఆపై తమ పార్టీ నేత రాహుల్ గాంధీ దేశ ప్రధాని పగ్గాలు చేపడతారని వ్యాఖ్యానించారు. బీజేపీని గద్దెదింపాలంటే గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘఢ్ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీని తాము ఓడించాల్సి ఉంటుందని అన్నారు. ఉత్తరాఖండ్తో ఈ దిశగా జైత్రయాత్ర సాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హరీష్ రావత్ ఓ వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలనూ సమానంగా గౌరవించని నాడు తాను ఆ పార్టీని వీడుతానని స్పష్టం చేశారు. విపక్షాలపై కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి సంస్ధలను ఉసిగొల్పుతోందని ఆరోపించారు. పార్టీ నాయకత్వంపై వ్యాఖ్యానిస్తూ తాను చేసిన ట్వీట్పై సమయం వచ్చినప్పుడు అందరితో పంచుకుంటానని హరీష్ రావత్ చెప్పారు.