ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు ఒక ఆఫర్ వచ్చిందని తెలిపారు. దానికి తాను అంగీకరించి ఉంటే మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం రెండేళ్ల కిందటే పడిపోయేదని చెప్పారు. అయితే న్యాయం మీద నమ్మకం ఉండటంతో ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు వెల్లడించారు. ఆదివారం వార్ధాలోని సేవాగ్రామ్లో జరిగిన అటవీ హక్కుల రాష్ట్ర స్థాయి సదస్సులో అనిల్ దేశ్ముఖ్ ప్రసంగించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా చర్యలు తీసుకుంటామని బెదిరించడం వల్లనే శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని విమర్శించారు. అయితే బూటకపు ఆరోపణలతో తనను 14 నెలలు జైల్లో ఉంచారని, అయినప్పటికీ బెదిరింపులు, ప్రలోభాలకు తాను లొంగలేదని అన్నారు.
కాగా, మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న అనిల్ దేశ్ముఖ్ను మనీలాండరింగ్, అవినీతి కేసుల ఆరోపణలపై 2021 నవంబర్లో ఈడీ అరెస్ట్ చేసింది. సుమారు 14 నెలలు జైలులో ఉన్న ఆయన గత ఏడాది డిసెంబర్ 28న బెయిల్పై విడుదలయ్యారు. అయితే తాను జైలులో ఉన్నప్పుడు తనకు వచ్చిన ఆఫర్ను అంగీకరించి ఉంటే రెండున్నర ఏళ్ల కిందటే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పడిపోయేదని తెలిపారు. న్యాయవ్యవస్థపై నమ్మకంతో ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు చెప్పారు.