చండీగఢ్: ఆఫీసులో కుర్చీ (Office Chair) కోసం ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి తన సహోద్యోగిపై గన్తో కాల్పులు జరిపాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. గురుగ్రామ్లోని సెక్టార్ 44లో పైసాబజార్ సంస్థ కార్యాలయం ఉంది. అందులో పని చేసే ఇద్దరు ఉద్యోగుల మధ్య బుధవారం గొడవ జరిగింది. ఆఫీస్లోని కుర్చీ కోసం అమన్ జాంగ్రా, విశాల్ మధ్య ఘర్షణ జరిగింది. కోట్లాట నేపథ్యంలో విశాల్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే అమన్ అతడ్ని అనుసరించాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న విశాల్పై గన్తో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గన్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన విశాల్ను ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే తీవ్రంగా గాయపడిన విశాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు అమన్ జాంగ్రా కోసం వెతుకున్నట్లు తెలిపారు. అతడిపై హత్యాయత్నంతోపాటు, ఆయుద్ధ చట్టం సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read: