హైదరాబాద్ : దేశంలో నెలకొన్న అంధకారాన్ని పోగొట్టేందుకే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నాం సింగ్చడూనీ స్పష్టం చేశారు. దేశమంతా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీని పంజాబ్లో ఊరూరా విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు. పంజాబ్లోని లూథియానలో రైతులు, వివిధ వర్గాల ప్రతినిధులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా గుర్నాం సింగ్ చడూనీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం అద్భుతంగా సాగుతున్నదన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వవరించారు. సాగునీటి రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టును రికార్డు స్థాయిలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.
తాము తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కాళేశ్వరం అద్భుతాలను పరిశీలించామన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని సీఎం కేసీఆర్ నాయత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. దళితవర్గాల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని అమలు చేస్తూ, దళిత కుటుంబాలను వ్యాపార కుటుంబాలుగా సీఎం కేసీఆర్ మారుస్తున్నారని ఆయన వివరించారు. బీఆర్ఎస్తోనే దేశంలో అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన వివరించారు. పంజాబ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈదేశానికి ఏం చేశాయని గుర్నాం సింగ్ నిలదీశారు.
ఎనిమిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రభుత్వం రంగ సంస్థలను అమ్మడమే పాలనగా సాగిస్తోందని మండిపడ్డారు. ఆయన మండిపడ్డారు. బీఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఎల్ఐసీ, పోర్టులు సహ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా మోదీ సర్కార్ అమ్మేస్తున్నదని ధ్వజమెత్తారు. అన్నిటి కన్నా ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందని, దీన్ని అడ్డుకోకపోతే దేశ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందన్నారు.