న్యూఢిల్లీ, ఆగస్టు 26: అంతర్గత సంక్షోభంతో ముక్కి మూలుగుతున్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. రెండేండ్లుగా పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, కాంగ్రెస్తో తన 50 ఏండ్ల అనుబంధాన్ని తెంచుకొంటున్నట్టు ప్రకటించారు. అన్ని పదవులతోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాకి శుక్రవారం లేఖ రాశా రు. మీడియాకు విడుదల చేసిన 5 పేజీల రాజీనామా లేఖలో కాంగ్రెస్ అధిష్ఠానంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ను ఎవరూ బాగుచేయలేరని, పునరుద్ధరించలేనంతగా ఆ పార్టీ దిగజారిపోయిందని అన్నారు. కాంగ్రెస్ను పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీయే నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
బాడీగార్డుల చేతిలో పార్టీ భవిత
పార్టీ నుంచి పోతూపోతూ రాహుల్గాంధీపై ఆజాద్ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్కు రాజకీయ పరిణతి లేదని, ఆయన సీరియస్ రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు. 2013లో రాహుల్గాంధీ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్లందరినీ కావాలని పక్కకు తప్పించారని ఆరోపించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షురాలిగా సోనియాగాంధీ ఉన్నా, పార్టీలో కీలక నిర్ణయాలన్నీ రాహుల్గాంధీయే తీసుకొంటారని తెలిపారు. వాస్తవానికి నిర్ణయాలన్నీ రాహుల్గాంధీ కూడా తీసుకోరని, ఆయన పీఏలు లేదంటే ఆయన బాడీగార్డులే కీలక నిర్ణయాలు తీసుకొంటారని బాంబు పేల్చారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సొంతపార్టీ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ కాపీలను ప్రజలందరి ముందు బహిరంగంగా చించివేసి రాహుల్గాంధీ తన చిన్నపిల్లల మనస్తత్వాన్ని బయటపెట్టుకొన్నారని, అలాంటి ఘటనలతోనే ప్రధానిపై, ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లి పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందని మండిపడ్డారు.
అంతర్గత ఎన్నికలు ఓ ప్రహసనం
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఎన్నికలకు తావే లేకుండా పోయిందని గులాంనబీ ఆజాద్ అన్నారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో (సోనియా నివాసం) కూర్చునే అతికొద్దిమంది తయారుచేసే జాబితానే అంతిమం అని విమర్శించారు. మండలం, జిల్లా, బ్లాక్ స్థాయిలో పార్టీ అంతర్గత ఎన్నికలకు తావే లేదని పేర్కొన్నారు. అంతర్గత ఎన్నికలంటేనే ఓ ప్రహసనం, అవమానకరంగా తయారయ్యాయని దుయ్యబట్టారు. పార్టీలో రాహుల్ చుట్టూ ఉండే కోటరీ ఏది చెప్తే అదే తుది నిర్ణయం అవుతున్నదని ఆరోపించారు. పార్టీలో దశాబ్దాలుగా కొనసాగిన సంప్రదింపుల వ్యవస్థను రాహుల్ ధ్వంసం చేశారని మండిపడ్డారు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత నిర్వహించిన పార్టీ సమావేశంలో సీనియర్ నేతలను రాహుల్ అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు. సరైన నిర్ణయాలు తీసుకోలేక కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తన స్థానాన్ని బీజేపీకి, రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలకు వదులుకొన్నదని అన్నారు. ఆజాద్ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది.
ఆజాద్ వెంటే కశ్మీర్ కాంగ్రెస్
కాంగ్రెస్కు గులాంనబీ ఆజాద్ రాజీనామాతో జమ్ముకశ్మీర్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో చాలామంది కాంగ్రెస్ నేతలు ఆజాద్ వెంట వెళ్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఐదుగురు సీనియర్లు కాంగ్రెస్కు రాజీనామా చేసి ఆజాద్ క్యాంపులో చేరారు. మాజీ మంత్రులు ఆర్ఎస్ చిబ్, జీఎం సరూరి, మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ అమిన్ భట్, మాజీ ఎమ్మెల్సీ నరేశ్ గుప్తా, పార్టీ నేత సల్మాన్ నిజామి ఇప్పటికే కాంగ్రెస్కు గుడ్బై చెప్పి ఆజాద్కు మద్దతు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు జెండా ఎగరేసి జీ 23 నేతలుగా గుర్తింపు పొందిన సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. జీ 23లో కీలక నేతలు కపిల్సిబల్, జితిన్ ప్రసాద్, యోగానంద శాస్త్రి ఇప్పటికే పార్టీని వీడారు. ఈ కూటమికి నాయకత్వం వహించిన ఆజాద్ తాజాగా రాజీనామా చేశారు.
ఆజాద్ కొత్త పార్టీ
కాంగ్రెస్ను వీడిన ఆజాద్ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరుతాననే ప్రచారాన్ని కొట్టివేశారు. తాను ఏ పార్టీలోనూ చేరట్లేదని, కొత్త పార్టీ ఏర్పాటుచేస్తానని వెల్లడించారు.