అహ్మదాబాద్ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ప్రముఖ పటేల్ నేత నరేష్ పటేల్ కాంగ్రెస్లో చేరతారని ప్రచారం సాగుతోంది. నరేష్ పటేల్ శనివారం సోనియా గాంధీతో సమావేశం కానున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. గత కొద్దినెలలుగా నరేష్ పటేల్ను తమ పార్టీలోకి రప్పించేందుకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్లు ప్రయత్నించాయి.
గుజరాత్లో పటేల్ వర్గం ప్రాబల్యం అధికంగా ఉండటంతో వారి ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఆయా నేతలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నరేష్ పటేల్ పార్టీలోకి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్ నరేష్ పటేల్ చేరిక పట్ల స్పందిస్తూ పటేల్ నేతలను, నరేష్ పటేల్ను కాంగ్రెస్ అవమానిస్తోందని దుయ్యబట్టారు.
నరేష్ పటేల్ పార్టీలోకి వస్తారని రెండేండ్ల నుంచి ప్రచారం సాగుతున్నా పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయిందని ప్రశ్నించారు. 2017 ఎన్నికల్లో పటేల్ వర్గీయుల ఆదరణతో కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్ధానాలు దక్కించుకున్నా పటేల్ వర్గాన్ని అవమానిస్తోందని దుయ్యబట్టారు. పార్టీపై హార్ధిక్ పటేల్ విమర్శల నేపధ్యంలో రాష్ట్ర నేతలు పలువురు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు.