అహ్మదాబాద్: బ్రెయిన్ డెడ్ అయిన ఐదు రోజుల శిశువు తన అవయవాలతో ముగ్గురు పిల్లలకు కొత్త జీవితం ఇచ్చింది. (Organ Donation) శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి, రెండు కిడ్నీలను ఇద్దరు పిల్లలకు ట్రాన్స్ప్లాంట్ చేశారు. గుజరాత్లోని సూరత్లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 13న ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి బాబుకు చేతన జన్మనిచ్చింది. అయితే ఆ దంపతుల సంతోషం కొన్ని గంటలే నిలిచింది. పసిబాబులో ఎలాంటి కదలిక లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆ శిశువును వెంటిలేటర్పై ఉంచారు. బాబు బతికే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. ఐదు రోజుల శిశువు బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు.
కాగా, ఎన్జీవో సంస్థ జీవన్దీప్ అవయవ దానం ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ విపుల్కు ఈ విషయం తెలిసింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్తో కలిసి ఆ శిశువు తల్లిదండ్రులైన చేతన, హర్షాను ఆయన కలిశారు. బ్రెయిన్ డెడ్ అయిన పసి బాబు అవయవాలు దానం చేయాలని కోరారు. చివరకు వారిని ఒప్పించారు. ఈ నేపథ్యంలో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు శరీరం నుంచి రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. సంబంధిత అవయవాల బ్యాంకులకు వాటిని తరలించారు.
మరోవైపు ఢిల్లీకి తరలించిన శిశువు కాలేయాన్ని తొమ్మిది నెలల చిన్నారికి విజయవంతంగా అమర్చారు. అలాగే శిశువు రెండు మూత్రపిండాలు 13, 15 ఏళ్ల పిల్లలకు ట్రాన్స్ప్లాంట్ చేయడంతో వారికి కొత్త జీవితం ఇచ్చాయని డాక్టర్లు గురువారం తెలిపారు.