(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఎనిమిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర మూడు రెట్లు పెరిగింది. పెట్రోల్పై 194 శాతం, డీజిల్పై 512 శాతం పన్ను మోత మోగింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతలా అంటే.. తాము ఎదుర్కొన్న బాధల గాఢతను యావత్తు దేశానికి చూపించాలనుకొన్నారు. అందుకే, ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రం గుజరాత్ అసెంబ్లీకి గురువారం తొలి దఫా పోలింగ్ జరిగింది.
పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన కొందరు.. ధరాఘాతంపై వినూత్నంగా నిరసన తెలియజేశారు. గ్యాస్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ.. సూరత్లో పలువురు సిలిండర్లను భుజం మీద, సైకిల్ మీద పెట్టుకొని పోలింగ్ స్టేషన్కు చేరుకొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ ఆమ్రేలీలో సైకిళ్లపై కేంద్రాలకు చేరుకొన్నారు. మోటర్ సైకిళ్లలో పెట్రోల్ నింపుకొనే స్థోమత లేదంటూ మీడియాకు చెప్పారు.
‘లంపీ స్కిన్’ వైరస్ కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ రాజ్కోట్లో కొందరు పశువులతో పోలింగ్ కేంద్రానికి చేరుకొన్నారు. ఈ వీడియోలు రోజంతా జాతీయ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం కావడం బీజేపీనేతలకు మింగుడు పడకుండా చేసింది.