Gujarat Employees Protest | ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) తోపాటు పలు డిమాండ్లు పరిష్కరించాలంటూ గుజరాత్లోని ఉపాధ్యాయులతోపాటు ప్రభుత్వోద్యోగులు ఆందోళన బాట పట్టారు. శనివారం `సామూహిక సెలవు`లు పెట్టారు. అయితే, కొన్ని అనుబంధ సంఘాలు ఆందోళనను విరమించుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. ఓపీఎస్తోపాటు మెజారిటీ తమ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించిందని ఆ సంఘాలు తెలిపాయి. కానీ, సంబంధిత సంఘాల జిల్లా యూనిట్లు మాత్రం తమ ప్రధాన డిమాండ్ ఓపీస్ను ఆమోదించలేదని, ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశాయి.
`మా ప్రధాన డిమాండ్ ఓపీఎస్. ఈ డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పరిష్కరించలేదు. ఈ అంశం రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగిపై ప్రభావం చూపుతుంది. కనుక సామూహిక సెలవు ఆందోళనలో మేం పాల్గొంటున్నాం` అని రాష్ట్రీయ సంయుక్త్ మోర్చా సౌరాష్ట్ర రీజియన్ కన్వీనర్ మహేశ్ మోరీ చెప్పారు.
భావ్నగర్ జిల్లాలోనే దాదాపు ఏడు వేల మంది ఉపాధ్యాయులు సామూహిక సెలవులోకి వెళ్లారని మహేశ్ మోరీ తెలిపారు. ఓపీఎస్ పునః అమలు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు, పంచాయతీ రాజ్ హెల్త్ వర్కర్లు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఆందోళన బాట పట్టారు. గాంధీ నగర్లో భారీ సంఖ్యలో ఉద్యోగులు సామూహిక సెలవుపై వెళ్లడంతోపాటు ఓల్డ్ సచివాలయ క్యాంపస్లో ర్యాలీ నిర్వహించారు.
2005కి ముందు ప్రభుత్వ సర్వీసులో చేరిన ఉద్యోగులకు మాత్రమే పాత పెన్షన్ స్కీం అమలు చేసేందుకు అంగీకరించిందని ఓ ప్రభుత్వోద్యోగి చెప్పారు. తమలో చాలా మంది 2005 తర్వాత ఉద్యోగ సర్వీసులోకి వచ్చారని, వారి భవిష్యత్ మాటేమిటని ప్రశ్నించారు. కచ్ జిల్లా పరిధిలో టీచర్లతోపాటు 8000 మంది ఉద్యోగులు నిరసన బాట పట్టారు. తమ ప్రధాన డిమాండ్ ఓపీఎస్ను ఆమోదించాల్సిందేనని శైక్షిక్ మహాసంఘ్ కుచ్ ప్రత్మిక్ జాఖ్రాభాయి కెరాసియా చెప్పారు.