(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధికంగా కస్టడీ మరణాలు (లాకప్ డెత్లు) బీజేపీ పాలిత గుజరాత్లోనే చోటుచేసుకుంటున్నాయి. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఈ విషయం వెల్లడించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పార్లమెంటుకు ఇచ్చిన నివేదిక ప్రకారం.. లాకప్ డెత్లలో గుజరాత్ మొదటిస్థానంలో ఉన్నది. అత్యధిక కస్టడీ మరణాలు నమోదవుతున్న మూడు రాష్ర్టాలూ బీజేపీ పాలనలో ఉన్నవే. గడచిన ఐదేండ్లలో అత్యధికంగా గుజరాత్లో 80, మహారాష్ట్రలో 76, ఉత్తరప్రదేశ్లో 41 లాకప్ డెత్లు చోటుచేసుకున్నాయి. తమిళనాడు (40) నాలుగో స్థానంలో ఉండగా, బీహార్ (38) ఐదో స్థానంలో ఉన్నది. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికి వస్తే ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నది.
గుజరాత్లో 13,999 ఖైదీలుండే సామర్థ్యమున్న జైళ్లుండగా, వాటిల్లో ఏకంగా 16,597 మంది ఖైదీలు ఉన్నారు. అంటే 2,598 మంది ఖైదీలు ఎక్కువ ఉన్నారని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఇదిలా ఉండగా, గుజరాత్లో మొత్తం 745 పోలీసు స్టేషన్లుండగా, అందులో 622 స్టేషన్లలో మాత్రమే సీసీటీవీల వ్యవస్థ ఉంది. మిగిలిన 123 పోలీసు స్టేషన్లలో సీసీటీవీలు అమర్చనే లేదు.
గాంధీ పుట్టిన రాష్ట్రంగా గొప్పలు చెప్పుకోవడమే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం అయిన గుజరాత్లో కస్టడీ మరణాల సంఖ్య పెరుగుతుండటం సిగ్గుచేటు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై పోలీసు ఠాణాల్లో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తూ బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తున్నది.
-హిరేన్ బాంకర్, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి, గుజరాత్.