అహ్మదాబాద్ : అన్ని రంగాలపైనా ‘కృత్రిమ మేధ’ టెక్నాలజీ ప్రభావం చూపుతుండగా.. దీని వాడకాన్ని నిషేధిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న జడ్జిలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఉద్దేశించి ‘ఒక ఏఐ పాలసీ’ని విడుదల చేసింది. దీని ప్రకారం, న్యాయవ్యవస్థలో ఏఐ సాంకేతికతను ఏ రూపంలోనూ అధికారికంగా వాడరాదంటూ పేర్కొన్నది.
న్యాయం అందించటంలో మానవ ప్రమేయం, బాధ్యత ముఖ్యమని తెలిపింది. కోర్టు తీర్పులు, చట్టాన్ని వర్తింపజేయటం, బెయిల్, మధ్యంతర ఉత్తర్వులు, శిక్షలు వెలువరించటం మొదలైన వాటిల్లో ఏఐ టెక్నాలజీ వాడరాదని స్పష్టం చేసింది. గుజరాత్ జిల్లా జ్యుడీషియరీ జడ్జీల సదస్సులో ఈ ఏఐ పాలసీని హైకోర్టు విడుదల చేసింది.