(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): గుజరాత్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్రంలోని 1,017 కార్పొరేట్ కంపెనీలు, పలు ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) ఓ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పోలింగ్ రోజున సదరు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారా? లేదా? అని పర్యవేక్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగినట్టు గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీ భారతి తెలిపారు. పోలింగ్ రోజున ఓటు హక్కు వినియోగించుకోని ఉద్యోగుల వివరాలను సంస్థల వెబ్సైట్, కార్యాలయ నోటీసు బోర్డులో ప్రచురిస్తామని సదరు కంపెనీల ప్రతినిధులు పేర్కొనడం గమనార్హం.
ఓటు వేయాలంటూ ఉద్యోగులపై గుజరాత్ కంపెనీలు ఒత్తిడి తీసుకురావడం, దీనికి ఈసీ కూడా వత్తాసు పలకడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీకి మేలు చేకూర్చడానికే కంపెనీలు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. కాగా, ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని తప్పనిసరి చేయడం ప్రజాస్వామ్య దేశంలో సరైన చర్య అనిపించుకోదని, ప్రజాప్రాతినిధ్యచట్టం, 1951 ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయశాఖ సహాయమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ గతంలో పేర్కొన్నారు. తప్పనిసరి ఓటింగ్ భారత్లో ఆచరణ సాధ్యంకాదని గత ఆగస్టులో కేంద్రప్రభుత్వమే లోక్సభలో వెల్లడించింది. అయితే, ఇవన్నీ పక్కనపెట్టి కంపెనీలతో కలిసి ఈసీ స్వయంగా ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావడంపై విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్లో బీజేపీకి విజయావకాశాలు సన్నగిల్లుతున్నట్టు నివేదికలు చెబుతుండటం తెలిసిందే.