అహ్మదాబాద్: రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అలాగే రెండు, మూడుసార్లు ఒకే వ్యక్తిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నా మరోసారి అతనికి అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ ఆయన మాత్రం 32 ఏండ్లుగా ఏ ఎన్నికల్లోనూ ఓటమి చవిచూడలేదు. అదికూడా ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ సారి కూడా తనకు ఎదురులేదని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనే గుజరాత్లోని ద్వారకా ఎమ్మెల్యే పబుభా మాణెక్.
మాణెక్ 1990లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదికూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకిదిగి హేమాహేమీలను ఓడించాడు. అలా 1995, 1998లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్గానే విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2002 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్పై గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాణెక్.. 2007, 2012, 2017లో జరిగిన ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు.
కాగా, ఎనిమిదోసారి కూడా తాను ఎమ్మెల్యేగా గెలుపొందుతానని మాణెక్ విశ్వాసం వ్యక్తంచేశారు. తనను ప్రజలు ఎన్నుకోవడం లేదని, ఎంపిక చేసుకుంటారని చెప్పారు. నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజలతో తాను సత్సంబంధాలను కలిగి ఉన్నానని వెల్లడించారు.