(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెల్లని కాంతిని రంగులమయం చేసే వజ్రాన్ని సానబెట్టే గుజరాత్ వజ్ర శుద్ధి కార్మికుల జీవితాలు 27 ఏండ్ల బీజేపీ పాలనలో మసకబారాయి. ఎన్నికల ముందర ‘ఇది చేస్తాం.. అది చేస్తామం’టూ హామీలు గుప్పించి.. పోలింగ్ ముగియగానే పత్తా లేకుండా పోతున్న కమలదళం నేతల తీరు ఆ కార్మికులకు ఇప్పుడు పూర్తిగా అర్థమయ్యింది. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని ఏడు రోజులు కూడా లేని సమయంలో.. కఠిన నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లో ఓటేయబోమని తీర్మానించారు. దీంతో కమలనాథుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఓటేయవద్దు
ప్రపంచంలోని 90శాతానికి పైగా వజ్రాలను శుద్ధి చేస్తున్న గుజరాత్ కార్మికుల అవస్థలను బీజేపీ సర్కారు పట్టించుకోవట్లేదు. రమారమీ 27 ఏండ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఆ కార్మికులు ఇంకా దారిద్య్రరేఖకు దిగువనే బతుకీడుస్తున్నారు. సౌరాష్ర్ట, సూరత్, నవ్సారి పరిసర ప్రాంతాల్లో నివసించే దాదాపు 30 లక్షల మంది కార్మికులు.. సూరత్లో ఉన్న 20,000 చిన్న, పెద్ద ఫ్యాక్టరీలు, దుకాణాల్లో వజ్రాలను శుద్ధి చేసే పనిలో రోజూ నిమగ్నమవుతున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా రోజులో పది నుంచి పన్నెండు గంటల పాటు ఏకబిగిన పనిచేసినప్పటికీ, వీరికి ఇచ్చే నెల జీతం రూ.10 వేలు కూడా దాటట్లేదు. దీనిపై కార్మిక మంత్రిత్వశాఖకు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.
కార్మిక చట్టాలను అమలు చేయాలని, ప్రొఫెషనల్ ట్యాక్స్ను రద్దు చేయాలని గత కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బాయ్కాట్ చేయాలని గుజరాత్ వజ్ర కార్మికులకు.. ది డైమండ్ వర్కర్స్ యూనియన్ గుజరాత్ (డీడబ్ల్యూయూజీ) పిలుపునిచ్చింది. తమ డిమాండ్లను నెరవేర్చే పార్టీలకే ఓటేయాలని కోరింది. ఈ మేరకు ఇప్పటికే 25 వేల మందికి ప్రత్యక్షంగా లేఖలు, 40 వేల మందికి వాట్సాప్ సందేశాలను పంపింది. మిగతా వారికి రెండుమూడు రోజుల్లో సందేశాలు పంపించనున్నట్టు వెల్లడించింది.
జాతీయ స్థూల ఉత్పత్తిలో వజ్రాల వ్యాపారం ఏడెనిమిది శాతం వరకు ఉంటుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇది గమనించిన బడా కార్పొరేట్లు తమ వజ్రాల వ్యాపారాల్ని మరింతగా విస్తరిస్తున్నారు. అయితే చాలీచాలని జీతం, భవిష్యత్తుపై బెంగతో.. 2010 నుంచి కిందటేడాది వరకు గుజరాత్లో సుమారు ఐదు వేల మంది వజ్రాల శుద్ధి కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే అక్కడి దీన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు.
అందుకే బాయ్కాట్ పిలుపు
వజ్రాల శుద్ధి కార్మికుల కష్టాలను బీజేపీ పట్టించుకోలేదు. కార్మిక చట్టాల అమలు, ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు చేయాలన్న డిమాండ్లను పెడచెవిన పెట్టింది. అందుకే, ఈ ఎన్నికల్లో ఆ పార్టీని బాయ్కాట్ చేయాలని 30 లక్షల మందికి పిలుపునిచ్చాం.
-డీడబ్ల్యూయూజీ చీఫ్ రమేశ్ జిలారియా
వారికి సాయం అందించరా?
రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల్లో మరణించిన వారికి పరిహారం ఇస్తారు. అయితే, తగిన వేతనం, ఉపాధి లేక ఆత్మహత్య చేసుకొన్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం సాయం చేయదా?
-డీడబ్ల్యూయూజీ ఉపాధ్యక్షుడు భావేశ్ తంక్