(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): అతను ఓ దళితుడు. గుండెపోటుతో కన్నుమూశాడు. గ్రామంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు చేద్దామంటే అగ్రవర్ణాలు ససేమిరా అన్నాయి. దీంతో ఆ మృతుడి ఇద్దరు కొడుకులకు ఏంచేయాలో తోచలేదు. గ్రామానికి అవతలి ఒడ్డున ఓ ఖాళీ ప్రదేశం కనిపించింది. అక్కడికి చేరుకోవాలంటే మెడలోతు నీటిని దాటాల్సిందే. తప్పదు మరి. దీంతో అన్నదమ్ములు రాజేశ్, సంజయ్ పుట్టెడు దుఃఖంతోనే తండ్రి చునా బాయ్ వాల్మీకీ మృతదేహాన్ని అవతలి గట్టుమీదకు చేర్చి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లా దేకవాడలో గత మేలో జరిగింది ఈ ఘటన. ఒక్క దేకవాడ గ్రామంలోనే కాదు.. రాంపురా, ఇంద్రపురా, నాథ్పురా తదితర డజనుకు పైగా గ్రామాల్లో దళితుల పరిస్థితి ఇలాగే ఉన్నది. గ్రామాల్లో ఠాకూర్, పటేల్లకు వైకుంఠధామాలను నిర్మించిన సర్కారు.. దళితులకు శ్మశానవాటికలను ఏర్పాటు చేయలేదు. వ్యర్థాలు పడేసే డంప్యార్డుల్లో అంతిమ సంస్కారాలు చేసుకోండంటూ కొందరు సర్పంచ్లు దళితులను అవమానిస్తున్నారు. కులాలకు వేర్వేరు శ్మశానవాటికలు ఏర్పాటు చేయడమేంటని దళిత్ ఫౌండేషన్ కార్యకర్త కనుభాయ్ ప్రశ్నిస్తున్నారు. అగ్రవర్ణాలకు శ్మశానవాటికలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దళితులపై వివక్ష చూపించడమేంటని మండిపడుతున్నారు.
తెలంగాణలో ఆత్మీయ వీడ్కోలు
మనిషి చివరి మజిలీని ప్రశాంతంగా, గౌరవప్రదంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు అనేక చర్యలు చేపట్టింది. రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు వెచ్చించి పదివేల వరకు వైకుంఠధామాలను నిర్మించింది. ప్రహరీ, స్నానాల గదులు, పార్కింగ్, వెయిటింగ్ హాల్, అస్థికలు నిల్వ చేసుకొనే బాక్సులు ఇలా అనేక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఫ్రీజర్లు, మృతదేహాలను తీసుకుపోవడానికి ప్రత్యేక వాహనాలను సమకూర్చింది.