సూరత్, మార్చి 23: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి రెండేండ్ల శిక్ష విధిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. అసలేం జరిగిందంటే.. 2019 ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్లో రాహుల్ మాట్లాడుతూ ‘దొంగలంతా మోదీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారు?’ అని అన్నారు. దీనిపై సూరత్ ఎమ్మెల్యే పరువునష్టం దావా వేయగా, గురువారం కోర్టు రాహుల్ను దోషిగా తేల్చింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ, పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. కోర్టు తీర్పు వెలువరించే సమయంలో రాహుల్ గాంధీ కోర్టులోనే ఉన్నారు. తీర్పు అనంతరం రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహత్మాగాంధీ చెప్పిన ‘నా మతం సత్యం, అహింసపైనే ఆధారపడి ఉంటుంది. సత్యం నా దేవుడు. దాన్ని అహింసతోనే సాధిస్తాను’ అనే వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. మరో ట్వీట్లో స్వాతంత్య్ర సమరయోధులు భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుకు నివాళి అర్పిస్తూ.. భయం లేకుండా పోరాటం చేయాలని వీళ్లే నేర్పించారని తెలిపారు. ‘నా సోదరుడు దేనికీ భయపడడు’ అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. తీర్పుపై అప్పీల్ చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.
రాహుల్గాంధీకి ఆప్తోపాటు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. పరువు నష్టం దావా అంటే.. బీజేపీయేతర పార్టీలు, నేతలు ఉండకూడదన్న కుట్రలో భాగమేనని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ‘మాకు కాంగ్రెస్తో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ, ఇలా రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో ఇరికించడం సరికాదు. ప్రశ్నించడం ప్రజలు, ప్రతిపక్షాల హక్కు. కోర్టును గౌరవిస్తాం కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. జార్ఖండ్, తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా రాహుల్కు సంఘీభావం తెలిపారు.
అనర్హత వేటు నిర్ణయాన్ని రెండేండ్లు, ఆపై జైలు శిక్ష పడే దోషులకు వర్తింపజేస్తూ యూపీఏ ప్రభుత్వంలోనే నిర్ణయం తీసుకొన్నారు. శిక్షా కాలాన్ని ఐదేండ్లకు పెంచాలని శరద్ యాదవ్ లాంటి నేతలు సిఫారసు చేశారు. దానిపై అప్పట్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అయితే, ఆ ఆర్డినెన్స్ నేరచరితులను కాపాడేలా ఉన్నదని రాహుల్ కొట్టిపారేశారు.
రాహుల్కు కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో శుక్రవారం ప్రతిపక్ష నేతలతో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
రాహుల్కి పై కోర్టులో జైలు శిక్ష నుంచి ఉపశమనం లభించకపోతే ఎంపీగా అనర్హత వేటు పడే ప్రమాదం ఉన్నది. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం.. కనీసం రెండేండ్ల జైలు శిక్షతో ఒక కేసులో దోషిగా తేలిన వ్యక్తిని అదేరోజున డిస్క్వాలిఫై చేయవచ్చు. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అప్పటివరకు ఆయనపై చర్యలు ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆటోమేటిక్గా ఆయన అనర్హుడవుతాడని మరికొందరు అంటున్నారు.