Congress | అహ్మదాబాద్, మార్చి 4: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడిన వేళ గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో అత్యంత సీనియర్, 40 ఏండ్లుగా పార్టీలో కొనసాగిన ముఖ్య నేత, ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా(67), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంబరిష్ డెర్ కాంగ్రెస్ను వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని సోమవారం ప్రకటించారు. జనవరిలో జరిగిన అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేయటాన్ని నిరసిస్తూ పార్టీని వీడుతున్నామని వారు తెలిపారు.
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ మరికొద్ది రోజుల్లో గుజరాత్లో ప్రవేశిస్తుందనగా, ఆ రాష్ట్ర కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాను బీజేపీలో చేరుతున్నట్టు అంబరిష్ డెర్ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి నారన్ రాథ్వా పార్టీని వీడి బీజేపీలో చేరారు. గత నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయటం గమనార్హం. దీంతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 14కు పడిపోయింది.